బీజేపీలో ముసలం.. మునుగోడుపై పట్టుబట్టిన ఆ ఇద్దరు నేతలు

by Disha Web Desk |
బీజేపీలో ముసలం.. మునుగోడుపై పట్టుబట్టిన ఆ ఇద్దరు నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మునుగోడు ఇన్‌చార్జిపై ముసలం నెలకొంది. ఈ రేసులో ఇద్దరు మాజీ ఎంపీలు ఉన్నారు. బాధ్యతలు నాక్కావాలంటే నాక్కావాలని ఇరువురూ పట్టుబడుతున్నారు. ఒకరు తనకు ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగిస్తే హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకోవచ్చని తహతహలాడుతుండగా మరొకరు తనకొక్క అవకాశమిస్తే తానేంటో నిరూపించుకుంటానని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో మునుగోడు ఇన్ చార్జి ఫైట్ వివేక్ వర్సెస్ జితేందర్ రెడ్డిగా మారింది. పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఎవరినీ ఇన్ చార్జిగా ప్రకటించలేదు. షెడ్యూల్ వచ్చాక నిర్ణయం తీసుకోవచ్చని అలాగే పెండింగ్‌లో పెట్టింది. కానీ ఈ ఇద్దరు మాజీ ఎంపీలు మునుగోడు ఉప ఎన్నికల బాధ్యతల కోసం పార్టీ అధిష్టానం వద్ద ఇప్పటికే తమ రిక్వెస్ట్‌ను పెట్టినట్లుగా తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలను దళిత సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వివేక్‌కే ఆ చాన్స్ దక్కనుందని రాజకీయవర్గాల్లో టాక్. వివేక్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తే దళిత సామాజికవర్గానికి చెందిన ఓట్లను బీజేపీకి పడేలా చేయొచ్చని అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. జితేందర్ రెడ్డి కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మరో సామాజికవర్గానికి చెందిన నేతకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తే ఓట్లు కలిసొచ్చే అవకాశముందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే వివేక్‌కు అప్పగించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం.

మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తనకు ప్రాధాన్యత కల్పించడం లేదని చాలాకాలంగా నిరాశలో ఉన్నారు. దళితుడనే కారణంగానే తనను అధిష్టానం దూరం పెట్టుకుంటూ వస్తోందని పలుమార్లు తన ఆవేదనను అనుచరుల వద్ద చెప్పుకున్నట్లు టాక్. కాగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించి ఓట్లను రాబట్టుకోవడంతో పాటు వివేక్‌కు కూడా అవకాశం కల్పించినట్లవుతుందని పార్టీ భావిస్తోంది. కానీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాత్రం ఇన్ చార్జి బాధ్యతలు తనకే అప్పగించాలని రాష్ట్ర నాయకత్వాన్ని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీని గెలిపించానని ఈసారి కూడా తనకు అవకాశిస్తే హ్యాట్రిక్ కొడతానని అధిష్టానానికి రిక్వెస్ట్ పెట్టినట్లు సమాచారం. మునుగోడు బైపోల్ షెడ్యూల్ పై క్లారిటీ లేకపోవడంతో పార్టీ ఇన్ చార్జి నియామకం విషయంలో అధిష్టానం సైలెంట్‌గా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి చూద్దామనే ధోరణిలో ఉంది. అప్పటికి కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేమనే సంకేతాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ ఇద్దరు మాజీ ఎంపీలు మాత్రం ఇన్ చార్జి బాధ్యతల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మునుగోడు ఇన్ చార్జి నియామకం విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందోననేది వేచి చూడాల్సిందే.

Also Read : TRS కు భారీ షాక్ ఇవ్వబోతున్న బడా నేత.. కారు దిగేందుకు ముహూర్తం ఫిక్స్?

Also Read : బీజేపీ ట్రాప్ లో బీసీ కుల సంఘాల నాయకులు! కోవర్టులుగా టీఆర్ఎస్ నాయకులు


Next Story

Most Viewed